గిట్టుబాటు ధర కోసం మిర్చి రైతుల ఆందోళన

గిట్టుబాటు ధర కోసం మిర్చి రైతుల ఆందోళన 

హైదరాబాద్‌ : మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని బుధవారం హైదరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ ప్రధాన ద్వారం ఎదురుగా రహదారిపై మిర్చిని తగులబెట్టి రైతులు బైఠాయించారు. కొంతసేపు ట్రాఫిక్‌ జాం అయింది. చాదర్‌ఘాట్‌ పోలీసులు రైతులకు నచ్చజెప్పి మార్కెట్‌ కార్యాలయానికి పిలిపించగా, వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు, తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ అగ్రి ట్రేడర్స్‌ అధ్యక్షుడు బట్కరి విద్యానంద్‌ తదితరుల సమక్షంలో చర్చలు జరిపారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రాఘవేందర్‌, విద్యానంద్‌, శ్రీనివాస్‌ తదితరులు మాట్లాడుతూ మార్కెట్‌కు మిర్చి అధికంగా రావడం వల్ల లారీల కొరత ఏర్పడిందని, తీవ్రమైన ఎండల వల్ల హమాలీలు సరిగా రావడం లేదన్నారు. మిర్చి చివరి కోత వల్ల నాణ్యత లేకపోవడంతో ధర తగ్గిందన్నారు.
మద్దతు ధర రూ.6 వేలు కల్పించాలి: క్వింటాకు రూ. 2వేల లోపు కొనుగోళ్లు చేసుకుంటామని, ఇష్టమైతే అమ్మండి లేకపోతే లేదంటూ వ్యాపారులు తెగేసి చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. క్వింటాకు రూ.ఆరు వేల ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం మిర్చి రైతులను క్వింటాకు రూ.1500 ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.
గురు, శుక్రవారాల్లో కొనుగోళ్లు బంద్‌: మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన మిర్చి బస్తాలు పూర్తి కొనుగోళ్లు జరిగి బయటకు పోవాలంటే కొంత సమయం పడుతుందని ఇన్‌ఛార్జి ఎస్‌జీఎస్‌ మల్లేశం, సంయుక్త సంచాలకులు రవికుమార్‌ తెలిపారు. అందుకోసం గురు, శుక్రవారం మార్కెట్‌లో కొనుగోళ్లు బంద్‌ చేస్తున్నామని, ఆ రెండు రోజులు మిర్చి అమ్మడానికి మార్కెట్‌కు రైతులెవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'